మంత్రి పొన్నం ప్రభాకర్
ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు అందజేత
హుస్నాబాద్: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని తిరుమల గార్డెన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన(అరైవ్, అలైవ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్లు పాల్గొన్నారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో పోలీసులు వీడియో రూపంలో చూపించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు యూనిఫామ్లు, వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ వాహనాలు వేగంగా నడపడం, మొబైల్ మాట్లాడటం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదం అయిన మొదటి గంటల్లోనే ఆస్పత్రికి చేర్పించిన వారికి రూ.25వేలు ఇవ్వడమేకాకుండా.. రహవీర్ అవార్డు ఇచ్చి సన్మానించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఒక కుటుంబంలో కీలక సభ్యుడు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, ప్రాణాలు కాపాడే రక్షణ కవచం అని అన్నారు. హెల్మెల్, సీట్ బెల్ట్ వినియోగాన్ని రోజు వారి అలవాటుగా మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


