కడ్తాల్: ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరి బాధ్యతని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరి సతీష్ అన్నారు. సోమవారం మండల పరిధి మైసిగండిలోని ప్రైవేట్ గార్డెన్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ స్పెషల్ ఇంటెన్సివ్పై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్ స్థాయి బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను, ఇంటింటి సర్వేను పరిశీలించాలని, ఏ ఒక్కరి ఓటు తొలగింపునకు గురికాకుండా చూడాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సవరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు సద్వినియోగం చేసుకుని, అర్హులైన వారి ఒక్క ఓటు తొలగించకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి దేశ వ్యాప్తంగా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాయని, కాంగ్రెస్ ఓటర్ల ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, సభ్యుడు శ్రీనివాస్గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, విజయ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీ మండలాల అధ్యక్షులు బీచ్యానాయక్, ప్రభాకర్రెడ్డి, కిషన్రెడ్డి, జగన్, బాల్రెడ్డి, హరికిషన్నాయక్, కల్వకుర్తి పట్టణ అధ్యక్షుడు రాహుల్, నియోజకవర్గ బీఎల్ఓలు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


