మహేశ్వరం: వర్షపు నీరు, డ్రైనేజీ నీరు వేగంగా వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఏసీపీ జానకీరెడ్డి పేర్కొ న్నారు. సోమవారం మండల కేంద్రంలోని మలబార్గోల్డ్, విఫ్రో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, పాలిటెక్నిక్ కళాశాల, మోడల్ స్కూల్, కళాశాల, అగ్నిమాక కేంద్రం, ఆర్టీసీ డిపోలలో లోతట్టు ప్రాంతాలను ఆయన సీఐతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురిస్తే వరదనీరు రోడ్లపై, కంపెనీలు, పాఠశాలలు, కళాశాలల ఎదుట నిల్వకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు కురిసినప్పుడు వరదనీరు సులువుగా వెళ్లేలా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. రోడ్లపైన నీటి నిల్వల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. గత సంవత్సరం వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయని గుర్తుచేశారు. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం రాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వరద నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించారు. కార్యక్రమంలో సీఐ రాఘవేందర్రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.


