మంచాల: గ్రామాల్లో సుస్థిర వ్యవసాయానికి రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ అన్నారు. గురువారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని బండలేమూర్ గ్రామంలో సుస్థిర వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రోజురోజుకూ ఆహార పదార్థాల కలుషితం అధికమవడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. సాగులో రసాయన ఎరువులు వాడకం తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట, వర్మీ కంపోస్టు, జీవ ఎరువులు వాడాలన్నారు. నేలలో పోషకాలను గుర్తించి తదనుగుణంగా ఎరువులను ఉపయోగించాలన్నారు. విత్తన శుద్ధితో మెరుగైన ప్రయోజనాలు ఉంటాయన్నారు. ప్రధానంగా పర్యావరణం కాపాడుకొని పంటలను సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సుధీర్, అకిల, సర్పంచ్ పి.శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి పాండు రంగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


