త్వరలో హద్దులు నిర్ణయించి, ఫెన్సింగ్ వేసేందుకు నిర్ణయం
పహాడీషరీఫ్: బాలాపూర్ మండల పరిధిలోని జల్పల్లి గ్రామ బిజాన్గుట్ట ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయమై సాక్షి దినపత్రికలో ‘బిజాన్గుట్టపై అక్రమార్కుల కన్ను’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి ఆదేశానుసారం ఆర్ఐలు జమీల్, సుధాకర్లు జీపీవోలతో కలిసి ఉదయమే బిజాన్గుట్టకు చేరుకున్నారు. అధికారుల రాక విషయం తెలుసుకున్న వ్యక్తులు ప్రొక్లెయినర్ను అక్కడి నుంచి తరలించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రీ కాస్ట్ వాల్ ప్రహరీని ఈ సందర్భంగా కూల్చివేశారు. త్వరలోనే స్థలానికి హద్దులు నిర్ణయించి, కబ్జా బారిన పడకుండా శాశ్వత ఫెన్సింగ్ నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ భూమిలో ఎవరైనా కబ్జాకు పాల్పడినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.


