యాచారం: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు సూచించారు. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడలో శనివారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చోరీలు జరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బంధువుల ఇళ్లకు, శుభాకార్యాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలు నడిపే వారు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ నందీశ్వర్రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీలత, గ్రామ సర్పంచ్ అచ్చెన మంగ పాల్గొన్నారు.
కొందుర్గు: డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం కృషిచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని తంగెళ్లపల్లిలో సర్పంచ్ చందన అధ్యక్షతన శనివారం ఏర్పాటుచేసిన గ్రామసభకు ఆయన హాజరై మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటిని అరికట్టే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఆన్లైన్ గేములకు ఆకర్శితులై మోసపోవద్దని సూచించారు. తహసీల్దార్ ఆజంఅలీ భూదార్కార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనువాసు, ఎస్ఐ రవీందర్, ఏఎస్ఐ చత్రినాయక్ పాల్గొన్నారు.
ఫ్యూచర్సిటీతో
కందుకూరు: ఫ్యూచర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందనుందని మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ఫ్యూచర్సిటీలో నిర్మించిన ఎఫ్సీడీఏ భవనాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ వైపు ఒత్తిడి తగ్గేలా సీఎం రేవంత్రెడ్డి ఫ్యూచర్సిటీ ఏర్పాటుకు రూపకల్పన చేశారన్నారు. ప్రపంచంలోనే మేటి నగరంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని తెలిపారు. ఇక్కడ అన్ని రంగాలకు ప్రాధాన్యం కల్పించేలా భూములు కేటాయించనున్నట్టు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్సిటీని రద్దు చేస్తామని ప్రతిపక్ష నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి రాజకీయాలను పక్కనపెట్టి కలిసిరావాలన్నారు. ఈ నెల 10న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎఫ్సీడీఏ, స్కిల్స్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవం జరగునుందని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణానాయక్, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు సరికొండ మల్లేష్, ఎస్.వెంకట్రాంరెడ్డి, సీనియర్ నాయకులు చిర్ర సాయిలు, సురేందర్, యుగంధర్గౌడ్, మదన్పాల్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, వెంకటేష్, భూపాల్రెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.
పరిగి: పట్టణంలోని కొత్త చెరువు కుంటను పర్యాటక కేంద్రంగా మారుస్తానని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలోని కొత్తచెరువు కుంట మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త చెరువు కుంటను పరిగి పట్టణంలో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దుతానని అన్నారు. గతంలో కొత్త చెరువు కుంట అన్యాక్రాంతమైందని.. ప్రస్తుతం చెరువు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించామన్నారు ఎలాంటి సమస్యలున్నా తన తృష్టికి తేవాలని కోరారు.


