రైతుల అంగీకారం లేకుండా, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని స్థానికులు, బాధితులు కొంతకాలంగా నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కారు తీరుపై అంతా గుర్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో అలజడి సృష్టించే అవకాశం ఉందని అనుమానించిన పోలీసులు భూ బాధిత రైతులతో పాటు పలువురు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. వీరిలో ఇద్దరు అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఉండటం గమనార్హం.
అరెస్టు చేసి, అటు ఇటు తిప్పి..
అరెస్టులను తప్పుబడుతూ కొంతమంది నిరసనకారులు కోహెడలో సీఎం రేవంత్రెడ్డి సహా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి, సీఎంతో పాటు, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, గంటల తరబడి రోడ్లపై తిప్పుతూ.. చివరకు నాగోల్ పీఎస్కు తరలించారు. పోలీసులు, సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. రైతుల అంగీకారం లేకుండా శంకుస్థాపనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.


