పహాడీషరీఫ్: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకొని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. స్పోర్ట్స్ ఎరీనాలో భాగంగా జీహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని ఏరోసిటీ మామిడిపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్మించిన పలు నూతన నిర్మాణాలను స్కూల్స్ గ్రూప్స్ చైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, అగ్రికల్చర్, ఎడ్యూకేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాకేష్ చంద్ర అగర్వాల్, కన్హా శాంతి వనం ఓఎస్డీ డాక్టర్ నర్సిరెడ్డితో కలిసి రన్నింగ్ ట్రాక్, మినీ ఫుట్బాల్ కోర్ట్, స్విమ్మిగ్ పూల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో మానసిక పరిపక్వత పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు క్రీడారంగంలో రాణించేలా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి


