కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారు: తజిందర్ బగ్గా

న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసులను ఉపయోగించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా ఆరోపించారు. ఆయన గుండాయిజాన్ని ప్రదర్శించి మరీ తనను కిడ్నాప్ చేశారంటూ విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటే నిజంగా ఆయన ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతందని ఎద్దేవా చేశారు. అంతేకాదు అరవింద్ కేజ్రీవాల్కు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పోలీసులను రంగంలోకి దింపి వారిని అణిచేస్తారని బగ్గా ఆరోపించారు.
భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తజిందర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని, మతపరమైన శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆప్ నాయకుడు సన్నీసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మే 6న తాజిందర్ సింగ్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మార్చి 30న జరిగిన నిరసనల్లో అరవింద్ కేజ్రీవాల్ను బగ్గా బెదిరించినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.
అలాంటి ఆరోపణలు చేసినప్పుడూ ఎఫ్ఐఆర్లో పంజాబ్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించానని పేర్కొనాలి కానీ కేజ్రీవాల్ని చంపుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. అయినా తాను ఎవర్నీ బెదిరించలేదని ఇది కేవలం వ్యావహారిక వ్యక్తీకరణ మాత్రమే అని బగ్గా అన్నారు. అయినా తన పై వెయ్యి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ గురుగ్రంథ సాహిబ్ను అపవిత్రం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. ఈ మేరకు బగ్గా ఢిల్లీ డిప్యూటీ సీఎం సహాయకుడు అల్లర్ల కేసులో జైలు కెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ...కేజ్రీవాల్ను ఇతర పార్టీల్లో లోపాలను వేలెత్తి చూపించే ముందు తమ సొంత పార్టీలోని లోపాలను సరిదిద్దుకోమని నొక్కి చెప్పారు.
(చదవండి: దేశానికి తదుపరి ప్రధాని అమిత్ షా?.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు)