లక్ష్మణచాంద/మామడ:మరో రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. డ్రాపౌట్స్ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తోంది. అయితే ఈ మధ్యాహ్న భోజనం ఈసారి మరింత భద్రంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాధికారులకు సూచించింది. వేసవి సెలవులు ఈనెల 14న ముగియడంతో ఈనెల 15 నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మధ్యాహ్న భోజనం అమలులో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ఎటువంటి ఇబ్బందులు రాకుండా...
సురక్షితమైన వంట శాల, నాణ్యమైన ఆహారం, శుభ్రమైన పరిసరాలు, స్వఛ్చమైన తాగు నీరు ఈ నాలుగు అంశాలను తప్పకుండా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ జిల్లా విద్యాధికారులకు, ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు, ప్రత్యేకాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఒకరోజు శిక్షణ..
మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు మండల విద్యాధికారులకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. సమాజ భాగస్వామ్యంతో పుట్టినరోజు కార్యక్రమాలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు వంటి సందర్భాలలో విద్యార్థులకు ప్రత్యేక భోజనం అందించాలి. దాతల సహకారం తీసుకుని వివరాలు నమోదు చేయాలి. నాణ్యమైన ఆహారంను విద్యార్థులకు అందించాలి. ప్రతీ పాఠశాలలో స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్లు అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ, ఉద్యాన, అటవీశాఖ సహకారం తీసుకోవాలి. పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలం వినియోగించి ఆకుకూరలు, కూరగాయలు పండించి వాటిని మధ్యాహ్న భోజనానికి వినియోగించాలి. విద్యార్థుల భాగస్వామ్యంను పెంపొందించాలి. విద్యార్థులకు సబ్బు అందుబాటులో ఉంచి చేతులు కడుక్కునే సౌకర్యంను కల్పించాలి.
చేయాల్సిన పనులు ఇవే...
జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, పీఎం పోషణ్ నియమాలను అనుసరించి పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషక విలువలు గల ఆహారం అందించాలి.
జిల్లా సమాచారం...
ప్రాథమిక పాఠశాలలు 577
విద్యార్థుల సంఖ్య 23,398
ప్రాథమికోన్నత పాఠశాలలు 89
విద్యార్థుల సంఖ్య 6,373
ఉన్నత పాఠశాలలు 165
విద్యార్థులు 37,019
సోమవారం : కిచిడి, కోడిగుడ్డు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
మంగళవారం : అన్నం, సాంబార్, మిక్స్డ్
వెజిటేబ్ కర్రీ, రాగిజావ
బుధవారం : అన్నం, పప్పు, ఆకుకూర, కోడిగుడ్డు వెజిటేబుల్ కర్రీ
గురువారం : వెజ్ బిర్యానీ, మిక్స్డ్వెజిటేబుల్ కర్రీ, రాగిజావ
శుక్రవారం : అన్నం, సాంబార్, మిక్స్డ్వెజిటేబుల్ కర్రీ, కోడిగుడ్డు
శనివారం : అన్నం, పప్పు, ఆకుకూర,
మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, రాగిజావ
పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూ...


