ముధోల్: జిల్లాలో అడపా దడపా వర్షాలు కురస్తుండడంతో రైతులు పత్తి, సోయా, మొక్కజొన్న విత్తుకుంటున్నారు. దీంతో ఎరువుల కోసం పీఏసీఎస్ కార్యాలయాలకు వెళ్తున్నారు. శనివారం ముధోల్ పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు వేకువజామునే ఇలా బారులు తీరారు. డీఏపీ కోసం మండలంలోని విఠోలి, బ్రహ్మణ్గావ్, ఆష్ట తదితర గ్రామాల రైతులు వచ్చారు. ఉదయం 4 గంటల నుంచే క్యూలో బారులు తీరారు. 400 బస్తాలు రావడంతో అధికారులు 7 గంటలకు రైతులకు టోకెన్లు అందించి ఎరువులు విక్రయించారు. మరో రెండు మూడు రోజుల్లో ఎరువులు వస్తాయని సీఈవో భూమయ్య తెలిపారు.


