జనగణన మొదటి దశ పూర్తి..
2,14,686 గృహాల మ్యాపింగ్
పట్టణాల్లో 49,968, పల్లెల్లో 1.64 లక్షల ఇళ్లు
నిర్మల్చైన్గేట్: జిల్లాలో జనగణన–2027కు స ంబంధించిన మొదటి దశ ప్రక్రియ పూర్తయింది. గృహాల గుర్తింపు ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,14,686 గృహాలు ఉన్నట్లు ఎన్యూమరేటర్లు గుర్తించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కింపు జరగనుంది.
ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల
నియామకం
జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 1,405 ఎన్యూమరేటర్లు, 253 సూపర్వైజర్లును నియమించారు. స్వీయ గణనకు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అవకాశం కల్పించారు. తర్వాత మే 11 నుంచి గృహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమై జూన్ 9వ తేదీతో ముగిసింది.
గృహాలు, జనాభా వివరాలు..
జనగణనలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 49,968 గృహాలు ఉన్నట్లు గుర్తించగా, ఇక్కడి జనాభా 1,88,369గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 1,64,718 గృహాలు ఉన్నట్లు తేలగా, జనాభా 6,06,718గా ఉంది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో 28,917 గృహాలు, భైంసాలో 12,172 గృహాలు, ఖానాపూర్లో 8,879 గృహాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా జనగణన డిజిటల్ పద్ధతిలో జరగనుంది. ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. అన్ని వివరాలను యాప్లోనే నిక్షిప్తం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట్ల ఆఫ్లైన్ నమోదుకు కూడా అవకాశం కల్పించారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణన
పెరిగిన గృహాలు..
2011 జనగణనతో పోలిస్తే జిల్లాలో గృహాల సంఖ్య 48,923 పెరిగింది. 2011లో 1,65,768 గృహాలు ఉండగా, ప్రస్తుతం 2,14,68కి చేరాయి. జనాభా 12 శాతం పెరిగింది. 2011లో జిల్లా జనాభా 7,09,418 ఉండగా, ప్రస్తుతం 7,94,696కి చేరింది. పట్టణాల్లో గృహాల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగింది. 2011లో పట్టణాల్లో 18,274 గృహాలు ఉండగా, ప్రస్తుతం 49,968కి చేరాయి. ఆయా పట్టణాల జనాభా 2011లో 1,50,457 ఉండగా, ప్రస్తుతం 1,88,364కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 2011లో 1,47,489 గృహాలు, 5,52,961 జనాభా ఉండగా, ప్రస్తుతం 1,64,718 గృహాలు, 6,06,300 జనాభాగా నమోదైంది. జనగణన ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.


