నిర్మల్టౌన్: భవిష్యత్ మనుగడ కోసం ప్రతీ విద్యార్థి ఒక మొక్క నాటాలని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బోబడే అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 4న జిల్లా అటవీశాఖ కార్యాలయంలో వ్యర్థాలను తగ్గించండి– ప్రకతిని రక్షించండి అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుక్రవారం మెమొంటోలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్వో మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ పర్యావరణ పరిరక్షణపై ఉన్న అవగాహన, మక్కువతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రకృతిని కాపాడడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని సూచించారు. విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు నాగినిభాను, రామకృష్ణారావు, నజీర్ఖాన్, సంతోష్, వెన్నెల, సుజాత పాల్గొన్నారు.


