Kerala: ముస్లిం లీగ్ ‘మాస్టర్ ప్లాన్’.. అదిరిపోయే టార్గెట్‌? | Will Kerala See a Deputy CM After 4 Decades | Sakshi
Sakshi News home page

Kerala: ముస్లిం లీగ్ ‘మాస్టర్ ప్లాన్’.. అదిరిపోయే టార్గెట్‌?

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

Will Kerala See a Deputy CM After 4 Decades

మే 4న కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో రెండు కీలక ప్రశ్నలు రాష్ట్రాన్ని  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ యూడీఎఫ్ (యూడీఎప్‌) కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ముస్లిం లీగ్ పార్టీ మళ్లీ ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) పదవిని దక్కించుకుంటుందా? ప్రస్తుతం ముస్లిం లీగ్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు కేరళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి.

ముస్లిం లీగ్ వ్యూహాత్మక మౌనం
ఎన్నికలకు ముందే ముస్లిం లీగ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే చర్చ మీడియా, రాజకీయ పరిశీలకుల మధ్య తీవ్రంగా జరిగింది. అయితే బహిరంగంగా ఈ డిమాండ్ చేయకుండా పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోంది. తాము అధికారికంగా ఎలాంటి డిమాండ్ చేయలేదని పార్టీ సీనియర్ నేత పీకే కున్హాలికుట్టి స్పష్టం చేశారు.

‘అడగరు కానీ.. ఇస్తే కాదనరు’
ప్రస్తుతం ముస్లిం లీగ్ నాయకత్వం అవలంబిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వారు బహిరంగంగా డిప్యూటీ సీఎం కుర్చీని డిమాండ్ చేస్తూ మిత్రపక్షాలను ఇబ్బంది పెట్టకపోయినా, ఒకవేళ ఆ పదవిని ఆఫర్ చేస్తే మాత్రం సంతోషంగా స్వీకరించేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కూటమిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని లీగ్ భావిస్తోంది.

కున్హాలికుట్టికి దక్కేనా ఆ అరుదైన గౌరవం?
యూడీఎఫ్ కూటమికి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే కున్హాలికుట్టికి, ఆయన సేవలకు గుర్తింపుగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని కొందరు సీనియర్ నేతలు వాదిస్తున్నారు. అయినప్పటికీ, గతంలో తలెత్తిన ‘ఐదవ మంత్రి’ వివాదం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, కూటమిలో ఎలాంటి అంతర్గత విభేదాలు రాకుండా పార్టీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

కేరళ రాజకీయ చరిత్రలో డిప్యూటీ సీఎంల ప్రస్థానం
కేరళ రాష్ట్ర రాజకీయ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, ఇప్పటివరకు కేవలం ముగ్గురు నేతలు మాత్రమే ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. విశేషమేమిటంటే అందులో ఇద్దరు ముస్లిం లీగ్‌కు చెందినవారే కావడం గమనార్హం. రాష్ట్రంలో చివరిసారిగా ఒక నాయకుడు డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి దాదాపు 39 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఆ పాత చరిత్ర మళ్లీ ప్రాణం పోసుకోనుందా అనే చర్చ జరుగుతోంది.

తొలి ఉప ముఖ్యమంత్రులు
రాష్ట్ర మొట్టమొదటి డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ నేత ఆర్ శంకర్ (ఫిబ్రవరి 22, 1960 - సెప్టెంబర్ 26, 1962) పట్టమ్ థాను పిళ్లై మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత ముస్లిం లీగ్ (IUML) నేత సీహెచ్ మహమ్మద్ కోయా, కే కరుణాకరన్ రెండవ, మూడవ మంత్రివర్గాల్లో రెండుసార్లు (1981-1982, 1982-1983) ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన తన తుదిశ్వాస వరకు డిప్యూటీ సీఎంగానే కొనసాగారు.

సుదీర్ఘకాలం పనిచేసిన కే అవకదర్ కుట్టి నహా
సీహెచ్ మహమ్మద్ కోయా మరణానంతరం, కే కరుణాకరన్ మూడవ మంత్రివర్గంలో ముస్లిం లీగ్‌కే చెందిన కే అవకదర్ కుట్టి నహా (అక్టోబర్ 24, 1983 - మార్చి 25, 1987) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. కేరళ చరిత్రలో అత్యధిక కాలం (మూడేళ్ల 152 రోజులు) ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన రికార్డు ఆయన పేరిటే ఉంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: బెంగాల్‌కు యూపీ ‘సింగం’.. ఊర మాస్‌ వార్నింగ్‌!
 

Advertisement
 
Advertisement
Advertisement