న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో బాధితులు గర్భం దాల్చితే ఏ సమయంలోనైనా దాన్ని తొలగించుకునేలా కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. 15 ఏళ్ల బాధితురాలి గర్భవిచ్ఛిత్తి కేసులో గురువారం విచారణ జరగ్గా.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసులో బాలిక 31 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవలె సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. బలవంతంగా ఆమెతో బిడ్డను కనిపించడం అంటే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం ఆ సమయంలో స్పష్టం చేసింది. అయితే అయితే.. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎయిమ్స్ తరఫున కేంద్రం క్యూరేటివ్ పిటిషన్ curative plea వేసింది. ఈ దశలో గర్భవిచ్ఛిత్తి చేస్తే బాలిక ఆరోగ్యంపై సుదీర్ఘకాలంలో ప్రభావం పడే అవకాశం ఉందని.. మరో నాలుగు వారాలు ఆగితే ఆమె బిడ్డను కంటుందని అందులో పేర్కొంది. అయితే.. ఈ పిటిషన్పై సీజేఐ ధర్మాసనం ఇవాళ తీవ్రంగా స్పందించింది.
‘‘అత్యాచారం తర్వాత ఆమె అనుభవించిన బాధకు ఈ భూమ్మీద ఏ పరిహారం చెల్లించినా సరిపోదు. ముందుగా మీరు పౌరుల ఎంపికను గౌరవించండి. అసలు ఈ ఆదేశాలను సవాలు చేసే హక్కు మీకు లేదు. బాధితురాలు లేదంటే ఆమె కుటుంబమే సవాలు చేయగలరు. ఇది ఆ అమ్మాయికి, ఆమె గర్భం మధ్య పోరాటమే అనుకుంటే గనుక.. ఆమెకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వాల్సి ఉంటుంది.
న్యాయం కోసం అవసరమైతే చట్టం కఠినంగా ఉండాలి. ప్రస్తుత చట్టం మహిళల హక్కులను పరిమితం చేస్తోంది. దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. మీ చట్టాన్ని మార్చండి’’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ఉద్దేశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత వ్యాఖ్యానించారు. మరో న్యామూర్తి జస్టిస్ జోయ్మాల్య బాగ్చి ఈ పిటిషన్పై స్పందిస్తూ.. మేం వ్యక్తిగత ఎంపికలను గౌరవిస్తున్నాం. మీరు కూడా గౌరవించాలి అన్నారు.
అంతకు ముందు ఐశ్వర్య భాటి వాదిస్తూ.. ఈ దశలో గర్భస్రావం సాధ్యం కాదని, బాలిక శిశువును ప్రసవించి దత్తతకు ఇవ్వడమే మార్గమని తెలిపారు. ‘‘ఇది నేను చెబుతోంది కాదు.. AIIMS నివేదిక ఆధారంగా ఉంది. గర్భస్రావం చేసినా శిశువు బతికే అవకాశం ఉంది. కానీ తీవ్రమైన లోపాలతో పుడుతుంది. తల్లి జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది” అని ఆమె వాదించారు.
అయితే ఈ ధర్మాసనం ఈ వాదనను తిరస్కరించింది. ఆ బాలిక తన గర్భాన్ని కొనసాగిస్తే అది ఆమె మానసిక ఆరోగ్యంపై నిత్యం తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. ‘‘ఈ బాధతో ఆమె నిత్యం నరకం అనుభవించాలి. అది ఆమెను బలవన్మరాణానికి కూడా ప్రొత్సహించే ప్రమాదం లేకపోలేదు. ఈ వయసులో ఆ చిన్నారి ఎంతో సాధించాల్సి ఉంటుంది. అలాంటిది ఈ వయసులోనే ఆమెను ఇప్పుడే తల్లిని అవ్వమంటారా?. ఎయిమ్స్లో మంచి డాక్టర్లు ఉన్నారు. బాలిక భద్రతకు వాళ్లే గ్యారెంటీ తీసుకుంటారు. భవిష్యత్తులో ఆమె వైవాహిక జీవితం క్లిష్టమైనదైనా.. ఈ బాధ కంటే ఎక్కువేమీ కాదు. పుట్టబోయే బిడ్డకంటే బాలిక నిర్ణయానికే మేం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం’’ అంటూ సుప్రీం కోర్టు తేల్చేసింది.


