ముంబై: ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత. ఇది అత్యంత దురదృష్టకర ఘటన. విరోచనాలు, వాంతులతో కొద్దిసేటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చనిపోయారు. శనివారం(ఏప్రిల్ 25వ తేదీ) ముంబైలోని పైధోని ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా ఫుడ్ పాయిజన్ బారిన పడే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
బాధిత కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ రాత్రి గం. 10.30ని.లకు వీరంతా డిన్నర్లో బిర్యానీ తిన్నారు. అనంతరం ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ తిరిగి వారు ఇళ్లకు బయల్దేరి వెళ్లిపోయారు. సుమారు ఒంటి గంట ప్రాంతంలో(తెల్లవారితే ఆదివారం) తమ ఇళ్లకు చేరుకున్నారు.
అయితే మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నారు. పుచ్చకాయ తిన్న తర్వాత ఆ నలుగురికి ఆదివారం ఉదయం ఐదుగంటల ప్రాంతంలో వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఫుడ్ పాయిజన్ అయ్యిందనే అనుమానంతో ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ చూసిన తర్వాత వారిని జేజే ఆస్పత్రికి వెళ్లమని సూచించారు.
వారి డాక్టర్ సూచించిన విధంగానే జేజే ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య చికిత్స చేసినప్పటికీ, చిన్న కుమార్తె ఉదయం సుమారు 10:15 గంటలకు మరణించింది. ఆ రాత్రి సుమారు 10:30 గంటలకు తండ్రి కన్నుమూశారు. అటు తర్వాత తల్లి, మరొక సోదరి కూడా చికిత్స సమయంలోనే కన్నుమూశారు.
బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడమే వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ రెండు స్పల్ప వ్యవధిలో తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందా.. ? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్మార్టం తర్వాతే వారి మరణానికి కారణం తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా జేజే మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతిచెందిన వారు అబ్దుల్లా దొకాడియా(40), నస్రీన్ దొకాడియా(35), ఐషా(16), జైనబ్(13)లుగా పోలీసులు తెలిపారు.


