● సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ దేవరాజ్
మిర్యాలగూడ టౌన్ : భూ వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు పట్టణంలో ఆస్తులకు కచ్చితమైన హద్దులను నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నక్ష సర్వేపై ప్రజలకు ఆపోహలు వద్దని నక్ష సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ దేవరాజ్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నక్ష సర్వేపై రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్ష సర్వేలో భాగంగా పట్టణంలో ప్రతి ఇంటిని, అస్తులను పక్కాగా సర్వే చేస్తామన్నారు. అధికారులు, సర్వే సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా గృహాలు, భవనాలు, ఖాళీ స్థలాలు మ్యాపింగ్ చేస్తామన్నారు. పట్టణ సర్వే అధికారులకు సహరించాలన్నారు. జూలై చివరి వరకు ఈ నక్ష సర్వే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో నక్ష సర్వే డీఐ శ్రీనివాస్రెడ్డి, పవన్, మేనేజర్ జ్ఞానేశ్వరి తదితరులున్నారు.
ఎంజీయూలో
‘లైబ్రరీ ఎట్ యువర్ కాలేజ్’
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో మంగళవారం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజర్ కాలేజీల ఆధ్వర్యంలో ‘లైబ్రరీ ఎట్ యువర్ కాలేజ్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ల్రైబరీని యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీ యూనివర్సిటీలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ల్రైబరీ నిర్వహిస్తారని తెలిపారు. లైబ్రరీలో విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, పరిశోధనా గ్రంథాలు, సాహిత్య, అకడమిక్ పుస్తకాలను అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఇన్చార్జి ప్రేమ్సాగర్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్స్ శ్రీదేవి, అరుణప్రియ, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.
నేడు మంత్రి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 9 గంటలకు నల్లగొండకు చేరుకుని.. 10 గంటలకు నల్లగొండలోని మిర్యాలగూడ రోడ్డులో ఉర్దూ మీడియం పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మంత్రి వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల్లో పాల్గొని.. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరి వెళతారు.
డీఎంహెచ్ఓ బదిలీ
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన స్పౌజ్ కింద హైదరాదాద్ జిల్లాకు బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బదిలీచేశారు. ఈయన స్థానంలో డీంఎహెచ్ఓగా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు.


