నిడమనూరు : గ్యాస్ సిలిండర్ కోసం నిడమనూరులో వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సిలిండర్లను సీరియల్లో పెట్టి ఎండలో వేచిచూస్తున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ గోదాము వద్ద 200 మీటర్లకు పైగా వరుసగా 4 వందలకు పైగా సిలిండర్లు వరుస క్రమంలో పెట్టి బారులుదీరారు. ఆ ప్రాంతం అంతా గ్యాస్ కోసం వచ్చే వారి వాహనాలతో నిండిపోయింది. గ్రామీణ విత్రక్ పథకంలో మండలానికి గ్యాస్ ఏజెన్సీ కేటాయించినప్పటికీ నిడమనూరు ఏజెన్సీ వారు నిడమనూరు మండలమే కాకుండా హాలియా, త్రిపురారం, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్) మండలాల్లో మొత్తం 25 వేల వినియోగదారులకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో వినియోగదారులకు డిమాండుకు తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్లు అందించలేకపోతున్నారు. నిడమనూరు భారత్ గ్యాస్ ఏజెన్సీకి వారానికి ఒకటి, రెండు లారీల సిలిండర్లు మాత్రమే వస్తున్నాయి. సిలిండర్లు వచ్చిన రోజునే గోదాం వద్ద పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సమస్యల లేదని కేవలం నిడమనూరులోనే గ్యాస్ కొరత ఉందని వినియోగదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా గ్యాస్ వినియోగదారుల డిమాండ్, బుకింగ్ ఆధారంగా గ్యాస్ పంపిణీ మెరుగుపడేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
నిడమనూరులోని గ్యాస్ ఏజెన్సీకి
25 వేల కనెక్షన్లు
వారంలో రెండు రోజులే సరఫరా


