మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. ఆలయ అర్చకులు రాజీవ్శర్మ, ఈశ్వర్చంద్ శర్మ భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.


