● గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలంటే
కార్యకర్తలు కష్టపడాలి
● బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు
హన్మకొండ: హైదరాబాద్లో నియంత రేవంత్ ఉంటే.. ఇక్కడో మరో నియంత ఉన్నాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.అక్కడ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతుంటే ఇక్కడ మరోలా పేదల ఇళ్లు కూల్చుతున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకుడు రంజిత్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం, ఎస్ఐఆర్పై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హరీశ్రావు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయానికి ఇది కీలకమవుతుందని, ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తుంచుకుంటామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలపై బీఆర్ఎస్ అద్భుతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజీలా పని చేస్తుందన్నారు. భద్రకాళి దేవస్థానం సమీపంలోని చెరబండరాజు కాలనీవాసులపై అమానుషంగా దాడి చేశారని, దాడిని ఖండించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్యెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ జెడ్పీ చైర్మన్ సమ్మారావు పాల్గొన్నారు.


