మూత్రపిండ బాధితుల వివరాలు
‘డయాలసిస్ సెంటర్’
ఏటూరునాగారం: మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకునేందుకు గతంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ వరంగల్, మణుగూరు, ఖమ్మం తదితర జిల్లాలకు తరలివెళ్లేది. 2023లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం రూ.40లక్షలతో మూడు డయాలసిస్ యంత్రాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసి ప్రారంభించింది. ఇప్పుడు ఆ డయాలసిస్ సెంటర్ ఏజెన్సీ కిడ్నీ బాధితులకు వరప్రదాయినిగా మారింది. ప్రతీ రోగి వారంలో మూడు మార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటూరునాగారం మండలకేంద్రంలోని సామాజిక ఆస్పత్రి ఆవరణలో రూ.40లక్షలు నిధులు కేటాయించి మూడు మిషన్లతో సెంటర్ను ప్రారంభించారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నడుస్తున్నాయి. ఎలాంటి ఫీజులు చెల్లించకుండా చికిత్స పొందుతున్నారు.
మరో రెండు యంత్రాలు అవసరం
ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలకు చెందిన మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఏటూరునాగారం డయాలసిస్ సెంటర్ భరోసాగా నిలుస్తుంది. ప్రతీ వ్యాధిగ్రస్తుడు వారానికి మూడు మార్లు డయాలసిస్ చేసుకుంటే వారిలో ఉన్న రక్తం మళ్లీ శుద్ధి చేసి వారికి మళ్లీ ఎక్కించడం జరుగుతుంది. మూత్రపిండాలు పనిచేయకపోవడంతో వారిలో నీటి శాతం పెరిగిపోయి గుండెపోటు వచ్చి మరణించే ప్రమాదాలున్నాయి. అందుకు గాను వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకొని వెళ్తున్నారు. ఒక్కో రోగికి నాలుగు గంటల సమయం పడుతుంది. డయాలసిస్ చేసే సమయంలో మరికొంత మంది అవస్థలు పడుతూ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడంతో మిషన్లు మరో రెండు అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మూత్రపిండవ్యాధితో బాధపడే వారు ఎక్కువ సమయం వేచిఉండలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మరో రెండు మిషన్లు మంజూరు చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు
భరోసాగా నిలుస్తున్న ఏటూరునాగారం డయాలసిస్ సెంటర్
దూరప్రాంతాలకు వెళ్లకుండా
ఇక్కడే చికిత్స
మరో రెండు యంత్రాలు అయితే పూర్తిస్థాయిలో సేవలు
ప్రభుత్వం దృష్టి సారించాలని
బాధితుల వేడుకోలు


