ములుగు రూరల్: యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో గంజాయి కేసుల్లో శిక్షపడిన వారితో వృక్ష రూపణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వ్యక్తి జీవితంలో మార్పు సాధ్యమేనని తెలిపారు. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ముందుకు సాగాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ బాగుంటుందని వెల్లడించారు. గంజాయి అమ్మకాలపై సమాచారం అందించిన వారికి రూ. 5,116 నగదు బహుమతి అందిస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, సీఐ సురేశ్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ స్వామి, ఎస్సైలు ఉపేందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్కేకన్


