ఏటూరునాగారం: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లోని విద్యార్థిని విద్యార్థులకు చేపట్టిన సమ్మర్ క్యాంప్ కరాటే శిక్షణ నేటితో ముగిసినట్లు కరాటే మాస్టర్ హుస్సేన్ తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో 30 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులను 40 మంది విద్యార్థులకు ఇచ్చినట్లు వెల్లడించారు. జిల్లాలోని ఏటూరునాగారంలో మాత్రమే ఈ కరాటే శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మాస్టర్ వివరించారు. స్వీయరక్షణ అనే అంశంపై విద్యార్థినులకు ప్రత్యేక మెలకువలను నేర్పించామని తెలిపారు. ఆపద సమయంలో ధైర్యంగా ఉంటూ తప్పించుకోవడంతో పాటు పోలీసులను ఆశ్రయించాల్సిన పద్ధతులను వివరించినట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఏటూరునాగారం కరాటే అకాడమిలో చేరాలని సూచించారు.
పాలెంవాగు ప్రాజెక్టు తనిఖీ
వెంకటాపురం(కె): మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టును మంగళవారం సీడీఎస్ఈ డ్యామ్ సేఫ్టీ బృందం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటు ప్రాజెక్టులోని నీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టులో ఎంత నీరు నిల్వ ఉంటుంది.. ఎంత విడుదల చేశారు. డ్యామ్ సేఫ్టీ విషయాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో రిటైరర్డు సీడబ్ల్యూపీఆర్ఎస్ చైర్మన్ విజయ్ త్రయంబక్ దేశాయ్, సివిల్ డిపార్ట్మెంట్ ఎన్ఐటీడబ్ల్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి, ఐఐటీ, రేగొండ అసోసియేట్ ప్రొఫెసర్ సతీశ్కుమార్, ఎస్ఈ ఎస్డీఎస్వో సారంగం, ఈఈ ఎస్డీఎస్వో శ్రీలత, ఎస్డీఎస్వో డీఈఈ శైలజ, పాలెంవాగు ప్రాజెక్టు డీఈ కిశోర్ కుమా ర్, ఏఈలు కార్తీక్, సాయి ప్రసాద్, సాయిరాం, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు సిబ్బందికి
ప్రశంసపత్రాలు
భూపాలపల్లి: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడంలో ప్రతీ పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీ, సేవాదక్పథంతో విధులు నిర్వర్తించే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
గణపురం పోలీస్స్టేషన్ తనిఖీ
గణపురం: గణపురం పోలీస్స్టేషన్ను ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించి నేరాల నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.


