జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నేడు (మంగళవారం) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్స్టేషన్లను ప్రారంభించడంతోపాటు మరో 3 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు హాజరుకానున్నారు.
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
హేమాచలక్షేత్రంలో 11న బహిరంగ వేలం
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల షాపుల నిర్వాహణ హక్కులు పొందేందుకు ఈనెల 11న దేవాదాయఽ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటలను నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి సోమవారం తెలిపారు. 2026 మే 15 నుంచి 2027 జూన్ 25 వరకు సంవత్సరం పాటు కొబ్బరి కాయలు, పూజసామగ్రి విక్రయాలు జరుపుకునేందుకు 2 షాపులు, క్యాంటీన్లు 2, బొమ్మలు, గాజులు, దేవుడి ఫొటోలు విక్రయ షాపులకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 11న ఉదయం 11 గంటలకు హేమాచల క్షేత్రంలోని కల్యాణ మండపంలో నిర్వహించే వేలంలో పాల్గొనే వారు కొబ్బరికాయలు, పూజ సామగ్రి ఒక్కో షాపుకు రూ.50,000, బొమ్మలు, గాజులు, క్యాంటీన్లు ఒక్కో షాపుకు రూ.25,000 చొప్పున దరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు.
14న సైక్లింగ్ పోటీలు
ములుగు/ములుగు రూరల్: ఈ నెల 14న జిల్లాకేంద్రంలో అస్మిత ఖేలో ఇండియా బాలికల సిటీ సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు మెరిట్ సర్టిఫికెట్తో పాటు మెడల్స్ అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతీఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందిస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తమ సొంత సైకిల్, ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకోవాలని, ఆసక్తి కలవారు ఈ నెల 12తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సైక్లింగ్ కోచ్ శ్రీరామ్ (88868 17492)ను సంప్రదించాలని కోరారు.
భారీగా ఎస్సైల బదిలీలు
భూపాలపల్లి: జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్బీ ఎస్సైగా పని చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్ను కాటారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న జె.మహేష్ను కాటారం ఎస్సై 2గా, మహాముత్తారం ఎస్సై పి.మహేందర్కుమార్ను కొయ్యూరుకు, వీఆర్లో ఉన్న ఎ.కల్యాణ్ను కొయ్యూరు ఎస్సై 2, భూపాలపల్లి ఎస్సై 2 జి.రమేష్ను మహాముత్తారం ఎస్హెచ్ఓగా, వీఆర్లో ఉన్న సాయి శశాంక్ను పలిమెల ఎస్హెచ్ఓ, భూపాలపల్లి ఎస్సై 1 మచ్చ సాంబమూర్తిని మహదేవపూర్ ఎస్హెచ్ఓగా, పలిమెల ఎస్సై జె.రమేష్ను మహదేవపూర్ ఎస్సై 2, మహదేవపూర్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్న కె.పవన్కుమార్ను భూపాలపల్లి ఎస్సై 1, చిట్యాల ఎస్సై 2గా పని చేస్తున్న ఎండీ షాఖాన్ను వీఆర్కు బదిలీ చేస్తూ డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీచేశారు.


