కేక్ కట్ చేస్తున్న రజనీకాంత్, నెల్సన్ దిలీప్కుమార్ తదితరులు
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ చిత్రం షూటింగ్ పూర్తయింది. నెల్సన్ దిలీప్కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్’. రమ్యకృష్ణ, సునీల్, తమన్నా, వసంత్ రవి, మిర్నా మీనన్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్’ సినిమా 2023 ఆగస్టు 10న విడుదలై తమిళంతో పాటు తెలుగులోనూ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. రజనీకాంత్–నెల్సన్ కాంబినేషన్లోనే ‘జైలర్’కి సీక్వెల్గా ‘జైలర్ 2’ చిత్రం రూపొందింది. ఈ సీక్వెల్లో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, ఎస్జే సూర్య, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు.
‘జైలర్’ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ‘జైలర్ 2’ని కూడా నిర్మించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ చిత్రయూనిట్ కొన్ని ఫొటోలు విడుదల చేసింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా రజనీకాంత్–నెల్సన్ దిలీప్కుమార్ కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు కూడా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, శివ రాజ్కుమార్, విజయ్ సేతుపతి వంటి వారు ‘జైలర్ 2’లో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.


