ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 1,972 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు సంబంధించి రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొ డ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 44 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఒక గేటు ద్వారా నీటి విడుదల
సుంకేసుల డ్యాంలో ఆదివారం ఒక గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ఎగువనున్న వాగులు, వంకల నీరు వచ్చి చేరడంతో 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు డ్యాం అధికారులు తెలిపారు.


