● ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: గత నెల రెండో వారంలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 5,568 మంది పరీక్షలకు హాజరైతే 67.37శాతంతో 3,751 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సుల్లో 566 మంది హాజరైతే 74.38 శాతంతో 421 మంది ఉత్తీర్ణతను నమోదు చేశారు. రెండో సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం 2,571 మంది హాజరు కాగా.. 1,218 మంది ఉత్తీర్ణులై 47.37 శాతం నమోదు చేశారు. ఒకేషనల్ కోర్సుల్లో 362 మంది పరీక్షలు రాయగా 55.80 శాతంతో 202 మంది ఉత్తీర్ణులయ్యారు.
చిన్నారుల ఆరోగ్యంపై
దృష్టి సారించండి
పాలమూరు: శిశు గృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. నగరంలో ఉన్న బాలసదన్, బాల రక్ష భవన్, శిశు గృహను గురువారం సందర్శించి స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిశీలించారు. ప్రధానంగా శిశు గృహలో ఉంటున్న చిన్నారులకు అందిస్తున్న ఆహారం, వారి ఆరోగ్య విషయంపై అడిగి తెలుసుకున్నారు. వర్షకాలం నేపథ్యంలో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
డీఏఓగా గోవింద్ నాయక్
మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)గా గోవింద్ నాయక్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఏఓగా బి.వెంకటేష్ రైతు శిక్షణ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (డీడీఏ)గా పనిచేస్తూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తిస్థాయి డీఏఓ నియమించడంతో వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ఎరువులు, విత్తనాల సరఫరా, పంటల ప్రణాళిక, రైతులకు సాంకేతిక సూచనల అమలులో మరింత సమన్వయం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. గురువారం గోవింద్నాయక్ బాధ్యతలు స్వీకరించారు.
ధాన్యం @ రూ.2,891
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,891, కనిష్టంగా రూ.1,666 ధరలు లభించాయి. అదేవిధంగా మొక్కజొన్న క్వింటా గరిష్టంగా రూ.2,045, కనిష్టంగా రూ.1,747, ఆముదాలు క్వింటా గరిష్టంగా రూ.6,295, కనిష్టంగా రూ.6,280, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,710, కనిష్టంగా రూ.6,680 ధరలు లభించాయి.


