ప్రతాపరుద్రుడి కోటపైన వాకర్స్
మన్ననూర్: నల్లమల ప్రకృతిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఆస్వాదిస్తూ అటవీ మార్గంలో మార్నింగ్ వాక్ చేస్తే రోగ నిరోధక శక్తి పెరిగి ప్రశాంతమైన ఆరోగ్యంతో పాటూ ఆహ్లాదంగా ఉంటుందని అచ్చంపేట ఎఫ్డీఓ చంద్రశేఖర్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో శనివారం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అచ్చంపేట నుంచి ప్రత్యేక వాహనంలో మన్ననూర్ సమీపంలోని నిరంజన్ షావలీ దర్గా వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సఫారీ కోసం వచ్చిన పర్యాటకులు కూడా వీరితో కలిసి సుమారు 3 గంటల పాటూ ట్రెక్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ప్రతాపరుద్రుడి కోట చారిత్రక విశిష్టతను ఎఫ్డీఓ వివరించారు. అదే విధంగా అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమల, అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో సింగిల్ వినియోగం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చందునాయక్ మాట్లాడుతూ.. అటవీ మార్గంలో కొండలు, గుట్టలు దాటుతూ ప్రకృతిలో మమేకమై నడుస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ట్రెక్కింగ్ జీవితాంతం గుర్తుండి పోతుందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఎండీ సుబూర్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్, ఎఫ్బీఓలు ఆశ, రజిత, శోభారాణి, పార్వతి, హన్మంత్, రమేశ్, సభ్యులు పోల శ్రీను, నిరంజన్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.


