మహమ్మదాబాద్: బాలల గొంతుకను వినిపించేందుకు వారికి అన్ని హక్కులు వర్తించేలా తెలుసుకునేందుకు బలమైన వేదికలుగా బాల పంచాయతీలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ జానకి తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నంచర్లలో తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ ఆధ్వర్యంలో యంగిస్తాన్ స్వ చ్ఛంద సంస్థ బాలపంచాయతీ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల భవిష్యత్ నాయకుల తయారీకి, బాలల హక్కులు, భద్రత, సంక్షేమ పరిరక్షణలో బాలపంచాయతీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. నాయకత్వం, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత ఆలోచనలతో సమాజమార్పునకు పిల్లలే వారధులని పేర్కొన్నారు. గ్రామాల్లోని బాలబాలికల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పంచాయతీలు పనిచేసేలా బాలపంచాయతీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బాలల విద్య. ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వాములు చేయడం ద్వారా వారిలో నాయకత్వ సామర్థ్యాలు మరింత పెరుగుతాయని, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుదన్నారు. కార్యక్రమంలో బాలలకు అనుకూల వాతావరణం కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనా, డిప్యూటీ ఈఓ శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీమోద్దీన్, తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డి, ఎంపీడీఓ నరేందర్, ఎస్ఐలు కృష్ణయ్య, సైదారావు, శేఖర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కేఎం నారాయణ పాల్గొన్నారు.


