జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రాష్ట్రంలో జూన్ 21న నిర్వహించనున్న నీట్–2026 రీ పరీక్షకు ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్నపత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితర ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాలని ఆదేశించారు. జూన్9న సీఎం చేతుల మీదుగా సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో మహిళా సమాఖ్య సభ్యులకు ఆర్టీసీ బస్సులు అందజేసే కార్యక్రమం జరుగనుందని, ఈ సభకు మహిళాసభ్యుల తరలింపుపై ఆయా జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు, ఆర్టీసీ ఆర్ఎంలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ జిల్లాలో మహబూబ్నగర్లో 12, జడ్చర్లలో ఒకటి చొప్పున మొత్తం 13 పరీక్ష కేంద్రాల్లో నీట్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో 4,291 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, అందుకోసం సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని, విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీసీలో అదనపుకలెక్టర్లు మధుసూదన్నాయక్, హరిప్రియ, ఏఎస్పీ ఎన్బీ రత్నం, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సురేందర్, అధికారులు పాల్గొన్నారు.


