● తన పొలం గుండా మట్టి తరలింపును
అడ్డుకోవడంతో దాడి
● తీవ్రంగా గాయపడి మృత్యువాత
సి.బెళగల్: రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పాతకక్షలు వ్యక్తి ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఘటనపై సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్రాజు సమాచారం మేరకు వివరాలు.. మండల పరిధిలోని పోలకల్ గ్రామానికి చెందిన మల్లెపోగు అమర్, పూలదాసు జగన్ (39) కుటుంబాల మధ్య గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన పొలంగుండా మట్టిని తరలించుకుంటున్నారంటూ జగన్ వర్గం వారు అమర్ వర్గం సభ్యులకు అడ్డుపడి ఘర్షణకు దిగారు. ఆగ్రహించిన అమర్ వర్గం సభ్యులు రాళ్లు, కట్టెలతో దాడి చేయగా జగన్ తలకు తీవ్ర రక్తగాయం అయ్యింది. బాధితుడు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసే చర్యలు చేపట్టారు. గాయపడిన జగన్ను కుటుంబ సభ్యులు పెంచికలపాడు ఆసుపత్రికి తలించగా కోలుకోలేక మృతిచెందాడు. ఘటనపై మృతుడి తల్లి సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే ఒకప్పటి ఫ్యాక్షన్ గ్రామంగా పేరొందిన పోలకల్లో దాడి ఘటనలో వ్యక్తి మృతి చెందడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


