కర్నూలు(టౌన్): వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007 ప్రకారం వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి జీవన భృతిని పొందే హక్కును వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఈ చట్టం ఆదేశాలను పిల్లలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష తప్పదన్నారు. సోమవారం స్థానిక బి.క్యాంప్లోని మన వృద్ధుల ఆశ్రమంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవం నిర్వహించారు. వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ వృద్ధుల పట్ల జరుగుతున్న వివక్ష, వేధింపులు, శారీరక, మానసిక, ఆర్థిక నిర్లక్ష్యంపై సమాజంలో అవగాహన కల్పించడం, అలాగే తగిన రక్షణ కల్పించడమే వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవ లక్ష్యమన్నారు. వృద్ధులకు కావలసిన ఉచిత న్యాయ సహాయం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100 ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. లీగల్ సర్వీసెస్ సభ్యులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, న్యాయవాది పాపా రావు, శ్రీరాములు, మురారి శంకరప్ప, బీమా ఎల్లాగౌడ్, త్రినాథ్ కుమార్ పాల్గొన్నారు.


