మంత్రాలయం రూరల్: గురురాఘవేంద్ర పాజెక్ట్లో భాగంగా మంత్రాలయం మండల పరిధిలో నిర్మించిన సూగూరు రిజర్వాయర్ కట్టకు చిన్న గండి పడింది. వగరూరు గ్రామ ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని అధికారులకు సమాచారం అందించారు. గండి పెద్దగా అయితే వగరూరు గ్రామం జలదిగ్బంధం అయ్యే అవకాశం ఉంది. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి విశ్వనాథ్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గండి పూడ్చడానికి అవసరమైన ఇటాచి, ట్రాక్టర్లను సమకూర్చారు. మరమ్మతులు చేపట్టాలని అధికారులకు, స్థానిక నాయకులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వగరూరు గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. కాగా.. సూగూరు ఈ రిజర్వాయర్ కింద 3000 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి వగరూరు, వి.తిమ్మాపురం గ్రామాలకు తాగునీరు అందుతోంది. రిజర్వాయర్ కట్ట మరమ్మతుల కోసం రూ. 17 కోట్లతో ప్రతిపాదనలు పంపినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా వర్షానికి ఆనకట్టకు గండిపడింది.


