కొణిజర్ల: రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పతనం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండలంలోని అమ్మపాలెంలో ఆదివారం సాయంత్రం ఆయన ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి బీఆర్ఎస్ జెండా దిమ్మెను ఆవిష్కరించి మాట్లాడారు. అధికారంలోకి రావడానికి ముందు అన్ని కులాల వారికి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నేతలు, ఢిల్లీలో దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్లు తొలగిస్తుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాక ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం నోరు మెదపలేదని పేర్కొన్నారు. అలాగే, రైతు రుణమాఫీ, రైతుబంధు అమలులో విఫలం కాగా, యూరియా సరఫరాకు యాప్ ప్రవేశపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కాగా, బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను అణగదొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని వద్దిరాజు స్పష్టం చేశారు. అధికారులు సైతం కాంగ్రెస్ పక్షాన నిలవకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, పోట్ల శ్రీను, డేరంగుల బ్రహ్మం, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, కిలారు మాధవరావు, ఖాదర్బాబా, హుస్సేన్, బూర ప్రసాద్, రాజ్కుమార్, జీడయ్య, బాబూరావు, విజయ, నాగయ్య, చిలుకూరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర


