భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చ న జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు నిత్య కల్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గోదావరికి నదీ హారతి
భద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద అధిక జ్యేష్టమాస అమావాస్య సందర్భంగా ఆదివారం నదీహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. శాంతి మంత్ర పఠనంతో ముగించారు. అర్చకులు రామ వజ్జల రవికుమార్, సత్యప్రసాద్శర్మ, అశోక్కుమార్ శర్మ, సుబ్రహ్మణ్య ఆచార్యులు పాల్గొన్నారు.


