నేటి నుంచి కొత్త విద్యాసంవత్సరం
మరో 114 పాఠశాలల్లో
ప్రీ ప్రైమరీ తరగతులు
యూనిఫామ్లో మార్పులతో ఈసారి ఆలస్యం
అల్పాహారం పథకాన్ని ప్రకటించినా అమలుపై అస్పష్టత
మరిన్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లు
జిల్లాలో పాఠశాలలు
ప్రత్యేకం.. భవిత
గతంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రమే పోస్టర్లు, కరపత్రాలతో ఇంటింటి ప్రచారం చేసేవారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాల విద్యార్థులు సాధించిన మార్కులను వివరిస్తూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. బడిబాట పేరిట ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కులు, ఇతర సౌకర్యాలను వివరిస్తున్నారు.
ఖమ్మంసహకారనగర్: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి కొత్త విద్యాసంవత్సరం మొదలుకానుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 12వ తేదీనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఎండల తీవ్రత దృష్ట్యా సెలవులు మరో మూడు రోజులు పొడిగించారు. ఈ మేరకు సొమవారం మొదలయ్యే కొత్త విద్యాసంవత్సరానికి ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, పాఠశాలల్లో ఇప్పటికే మధ్యాహ్న భోజనం అమలవుతుండగా, ఈసారి నుంచి అల్పాహారం కూడా సమకూరుస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, తొలిరోజే అల్పాహారం మొదలవుతుందా, కొంత సమయం పడుతుందా అన్నది సోమవారం స్పష్టత రానుంది.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా జిల్లాలోని 952 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తయింది. అంతేకాక గత ప్రభుత్వ హయంలో చేపట్టిన ‘మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి’ పథకం ద్వారా 195 పాఠశాలల్లో కూడా పనులు పూర్తయ్యాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కోసం అన్ని టైటిళ్లు కలిపి 4,45,820 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే 4,05,426 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరగా, ఎమ్మార్సీలకు ఆపై పాఠశాలలకు చేరవేశారు. మిగిలిన 40,394 పుస్తకాలు కూడా ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు చేరతాయని అధికారులు తెలిపారు. అలాగే, విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు పాఠశాలలకు చేర్చారు. తద్వారా పాఠశాలలు పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు అందించనున్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ నిర్వహిస్తుండడంతో తల్లిదండ్రులు అటే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యాన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ బోధన ప్రవేశపెట్టారు. గత ఏడాది జిల్లాలో 30 పాఠశాలలు ఉండగా, ఈసారి మరో 114 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో గదులకు రంగులు వేయించడం, పిల్లలను ఆకట్టుకునే బొమ్మలు వేసి సౌకర్యాలు సమకూర్చేందుకు నిధులు మంజూరు చేశారు. అంతేకాక ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకం కూడా చివరి దశకు చేరింది.
యాజమాన్యం సంఖ్య విద్యార్థులు
ప్రభుత్వ, అనుబంధం 1,319 84,222
ప్రైవేట్ 265 78,151
సీబీఎస్ఈ (ప్రైవేట్) 12 10,680
జిల్లాలో 21 మండలాల్లో ఎనిమిది భవిత కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. శారీరక వైకల్యంతో బాధపడే విద్యార్థులకు ఈ కేంద్రాల్లో ఫిజియోథెరపీ తదితర సేవలందించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పరికరాలు సమకూర్చడంతో పాటు ఇతర వసతులు సమకూర్చారు.


