చింతకాని: మండలంలోని లచ్చగూడెంలో శుక్రవా రం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా ఉప్పరపల్లి వెంకటేశ్వర్లు, తన్నీరు పుల్లమ్మకు చెందిన రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోవడంతో సామగ్రి తడిసి ముద్దయింది. అలాగే, గ్రామంలోని మసీదు వద్ద చింతకాని – వెంకటాయపాలెం రహదారిపై చెట్టు పడిపోగా గ్రామపంచాయతీ సిబ్బంది తొలగించారు.
●నేలకొండపల్లి: మండలంలోని మండ్రాజుపల్లిలో ఈదురుగాలులకు తుమ్మ నాగయ్య ఇంటి ప్రహరీ నేలమట్టమైంది. అలాగే, కోనాయిగూడెంలో బిందె చిరంజీవి ఇంటి ముందు భాగం పడిపోయింది. ఈ మేరకు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
పిడుగుపాటుతో ఆంబోతు, ఆవు మృతి
●ముదిగొండ: మండలంలోని కమలాపురంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంతేకాక శుక్రవారం తెల్లవారుజామున పిడుగుపడడంతో అమ్మపేటకు చెందిన రైతు వల్లబి వెంకటేశ్కు చెందిన ఆవు, గ్రామంలో తిరిగే ఆంబోతు మృతి చెందాయి. కాగా, ఆవు మృతితో రూ.70వేల నష్టం జరిగిందని రైతు వెంకటేశ్ వాపోయాడు. కాగా, సర్పంచ్ పందిరి అంజయ్య ఇచ్చిన సమాచారంతో వనంవారి కిష్టాపురం పశువైదాధికారి మన్నెం రమేశ్ ఆంబోతు కు పోస్టుమార్టం నిర్వహించగా, గ్రామంలో ఊరేగింపు నిర్వహించి ఖననం చేశారు. ఉపసర్పంచ్ మరికంటి లాలయ్య, పంచాయతీ కార్యదర్శి బి.లక్ష్మి, జీపీఓ శ్రీనివాస్తో పాటు వాక వెంకటేశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, మరికంటి కృష్టయ్య, పలుసు సీతా రాములు పాల్గొన్నారు.


