మధిర: మధిర వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడుతూ ఇక్కడి మార్కెట్ను రెగ్యులర్ యార్డుగా మార్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే హామీ ఇచ్చారని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిరంతరాయం కొనసాగుతాయని చెప్పారు. కాగా, తొలిరోజు రైతు రవికుమార్ తీసుకొచ్చిన తేజ రకం 18 బస్తాల మిర్చిని ట్రేడర్ కృష్ణ క్వింటాకు రూ.22వేల ధరతో కొనుగోలు చేశారు. ఇది ఈ సీజన్లో అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పారుపల్లి విజయ్కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాస్రెడ్డి, నాయకులు కర్నాటి రామారావు, కోల్డ్ స్టోరేజ్ యాజమానులు మందడపు రామకష్ణ, కళ్యాణపు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ బదిలీ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆర్.కిరణ్కుమార్ హనుమకొండ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన 19ఏళ్లుగా వివిధ హోదాల్లో జిల్లాలోనే పనిచేయడం గమనార్హం. ఈమేరకు బదిలీపై వెళ్తున్న కిరణ్కుమార్ను ఆహార తనిఖీ శాఖ అధికారులు, ఉద్యోగులు గురువారం సన్మానించారు. కాగా, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా ఇంకా ఎవరినీ నియమించలేదు.
13 మంది సీనియర్
అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతి
ఖమ్మం సహకారనగర్: జిల్లా రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ అసిస్టెంట్లు పలువురికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. ఈమేరకు జిల్లా నుంచి 13మంది మంది పదోన్నతి లభించగా వారిలో కొందరికి ఇక్కడే, ఇంకొందరిని ఇతర జిల్లాలకు కేటాయించారు. అలాగే, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ పదోన్నతి పొందిన వారిని జిల్లాకు కేటాయించారు. కాగా, గుగులోతు లక్ష్మణ్, పఠాన్ ఖాజామోహిద్దీన్, కాటిబోయిన అప్పిరాములు, నకిరికంటి జగదీశ్, దినవాహీ జ్యోతి, కే.వీ.వీ.ప్రసాద్కు పదోన్నతి కల్పించి జిల్లాకే కేటాయించారు. ఇక అల్లం రవికుమార్, బానోతు శ్యామ్ప్రసాద్ సింగ్, కె.రాజశేఖర్, షేక్ వహీద్, కే.వీ.సుజాత, కేతిబోయిన మానస, మహ్మద్ జాహెద్ బేగంను హన్మకొండ జిల్లాకు బదిలీ చేశారు.
724 మె.టన్నుల యూరియా
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు గురువారం స్పిక్ కంపెనీకి చెందిన 724.05 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 224.05 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేశామని వెల్లడించారు.
బీసీ స్టడీ సర్కిల్లో
శిక్షణ పూర్తి
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్లో నాలుగు రోజులుగా ఏఐ, లైఫ్ స్కిల్స్పై ఇస్తున్న శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న 139 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలపై నిపుణులతో శిక్షణ ఇప్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, గురువారం జరిగిన కార్యక్రమంలో డీబీసీడీఓ జి.జ్యోతి అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. శిక్షణ పొందిన వారు సాంకేతికత ఆధారంగా జీవనోపాధికి బాటలు వేసుకోవాలని సూచించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత, అక్షిత, ఏబీసీడీఓ వెంగళ్రావు తదితరులు పాల్గొన్నారు.
కనుల పండువగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.


