● రాష్ట్రపథకాలతో పేదలకు జరగని లబ్ధి ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరభద్రం
ముదిగొండ: ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించే వారిపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ముదిగొండ మండలం వెంకటాపురంలో బుధవారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు కేవలం హిందువులు – ముస్లింల మధ్య చిచ్చు పెట్టడంపైనే దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఏళ్లుగా దేశంలో అన్నివర్గాల వారు కలిసే ఉంటుండగా విభజన తీసుకొచ్చేందుకు కుట్ర పన్నారన్నారు. కాగా, రాష్ట్రప్రభుత్వ పథకాలు పెద్దలకు ఉపయోగపడేవే తప్ప పేదలకు ఎలాంటి లబ్ధి జరగడం లేదని తెలిపారు. హిట్లర్ను స్ఫూర్తిగా చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి, ఆయనను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కాగా, లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని నిలదీశారు. ఇంకా ఈ సభలో సీపీఎం జిల్లా, మండల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, బట్టు పురుషోత్తం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, నాయకులు బండి రమేష్, రాయల వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి వరప్రసాద్, వేల్పుల భద్రయ్య, ఆర్.వెంకట్రావు, బుర్రి ప్రసాద్, బండి రమేష్, బండి పద్మ, బుగ్గవీటి సరళ పాల్గొన్నారు.


