కూసుమంచి: రహదారి భద్రతను వాహనదారులంతా బాధ్యతగా భావిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కూసుమంచి మండలం నాయకన్గూడెంలో బుధవారం రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. వాహననం నడిపేటప్పుడు తమ కోసం కుటుంబం ఎదురుచూస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తద్వారా నిబంధనలు పాటిస్తూ వాహనదారులు తమను కాపాడుకోవడంతో పాటు ఎదుటి వాహనదారులకు మేలు చేసిన వారవుతారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యత కలిగిన హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ తప్పక ధరించాలని సూచించారు. అలాగే, మద్యం, మత్తు పదార్థాలను సేవించి వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడొద్దని తెలిపారు. అనంతరం ఇటీవల పలు ప్రమాదాల్లో గాయపడిన బాధిత కుటుంబాలతో మాట్లాడిన సీపీ వారికి సురక్షిత ప్రయాణంపై సలహాలు, సూచనలు అందించారు. అలాగే, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లోక్యాతండాకు చెందిన జర్పుల సందీప్ తల్లి లలితకు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కాంచాని సైదమ్మ, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ సంజీవ్, తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ జశ్వంత్కుమార్, ఎస్ఐలు నాగరాజు, జగదీశ్, సంతోష్, స్రవంతి, దివ్య, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు.
పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లకు అభినందన
ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఎనిమిది మంది (2000 బ్యాచ్)కి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వీరిలో నలుగురిని భద్రాద్రి జిల్లాకు, ఇద్దరిని ఖమ్మం కమిషనరేట్కు, మహబూబాబాద్, ఇంటెలిజెన్స్కు ఒక్కొక్కరినీ కేటాయించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వారు సీపీ సునీల్దత్ను బుధవారం కలవగా ఆయన అభినందించారు.
పోలీస్ కమిషనర్ సునీల్దత్


