ముదిగొండ: ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అంతేకాక పూర్తయిన పనులను ప్రారంభించారు. మండలంలోని యడలవల్లి లక్ష్మీపురంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించగా, యడవల్లిలో సబ్స్టేషన్, యడవల్లి నుంచి ఖమ్మం రూరల్ మండలం తల్లపాడు, యడవల్లి నుంచి తెల్దారుపల్లి వరకు రోడ్డు, ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో ఈఆర్ఓ కార్యాలయానికి శంకుస్థాపన చేశాక 50పడకల ఆస్పత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ పేదలకు పథకాలు మంజూరు చేస్తూనే, సౌకర్యాల కల్పనపై దృష్టి సారించామన్నారు. గ్రామీణ లింక్ రహదారుల అభివృద్ధి, సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీ.ఎస్., అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళలు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పి.దుర్గాప్రసాద్, సర్పంచ్లు కందుల బాలచందర్, యరకల భారతమ్మ, పందిరి అంజయ్య, ముదిగొండ, మేడేపల్లి సొసైటీల చైర్మన్లు తుపాకుల యలగొండస్వామి, సామినేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరామయ్యతో పాటు వనం బాబు, మందరపు నాగేశ్వరరావు, దేవేంద్రం, ఇసుకల రమేష్, మట్టా బాబురాంరెడ్డి, తలారి పిచ్చయ్య, దొంతగాని నాగరాజు, అన్వేష్, పాల్గొన్నారు.


