● సంప్రదాయాలను కాపాడేందుకు ఐటీడీఏ పీఓ రాహుల్ కృషి ● జాతీయ స్థాయిలో గుర్తింపు, రూ.5 లక్షల నగదు పురస్కారం ● కోయ భాష నేర్చుకుని ఆదివాసీలతో మమేకం
భద్రాచలం: గిరిజనాభివృద్ధికి, గిరిజన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పాటుపడుతున్న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ నెల 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన జాతీయ పీవోస్ కార్పొరేషన్లో దేశంలోనే ఉత్తమ ప్రాజెక్ట్ అధికారిగా నీతి అయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీస్ సెక్రెటరీ రంజాన్ చోప్రా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భద్రాచలం ఐటీడీఏ పీఓగా 2024 జూన్ 25న బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకునే క్రమంలో రూ. 5 లక్షల నగదు పురస్కారం అందుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సత్కారం పొందారు. గిరిజనులు, ఆదివాసీ సంఘాల నాయకులు, స్థానికులు కూడా అభినందిస్తున్నారు. గతంలో సైతం మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్గా పని చేసే సమయంలో బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా, బెస్ట్ రూరల్ టూరిజం అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం పీఓగా పని చేస్తూ ఆదివాసీ గిరిజనుల ఐక్యవేదిక తరఫున ఆదివాసీ వికాసరత్న బిరుదు పొందారు.
విద్యా, ఇతర రంగాల్లో
గిరిజన విద్యార్థులకు విద్యలో ప్రాథమిక దశలోనే కనీస సామర్థ్యాలను పెంపొందించే దిశగా ప్రత్యేకంగా ఉద్దీపనం పేరిట 3, 4వ తరగతుల్లో గణితం, ఇంగ్లిష్ సబ్జెక్ట్ల్లో స్టడీ మెటీరియల్ను తొలుత రూపొందించారు. ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటంతో దీనిని విస్తృతపర్చి 1, 2వ తరగతులకు సైతం ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య బలోపేతం కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. పదో తరగతి అనంతరం ఉన్నత విద్య, ఉద్యోగాలపై కెరీర్ గైడెన్స్ వాల్ను పాఠశాలల్లో ఏర్పాటుచేసి ఉన్నతాధికారులతో సూచనలు ఇప్పి స్తూ విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేస్తున్నారు.


