హొసపేటె: అడవి పందులను అక్రమంగా పట్టుకుని, తరలిస్తున్న వేటగాళ్లను గుర్తించి, ఇక్కడి ప్రాంతీయ అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా నుంచి గంగావతి వైపు పందులను తరలిస్తున్న వాహనం గురించి అందిన నిర్ధిష్ట సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సోమవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై టోల్గేట్ సమీపంలో ఒక వాహనాన్ని పట్టుకుని 24 అడవి పందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడు అర్జున్ రామ్సింగ్ షెనూరాను అరెస్టు చేశారు. ఏసీఎఫ్ ఏహెచ్.ముల్లా నేతృత్వంలో అటవీ అధికారి శివరాజ్ మేటి, డిప్యూటీ అటవీ అధికారి అబ్బుసామి గుట్టూరు, పరశురాం చక్రసాలి, సిబ్బంది రాఘవేంద్ర రాథోడ్, శివానంద తళవార, నీలప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో పాల్గొన్నారు.


