బనశంకరి: ఉద్యాననగరిలో భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మైమరిపించాయి. ఆదివారం సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రలో భరతనాట్య ప్రదర్శనను దివ్య ప్రభాత్, దీక్షా జోషి, పాయల్, తాన్యా రక్తి కట్టించారు. దుర్గా వర్ణం, దుర్గా స్తుతి రూపకాలను ప్రదర్శించారు. ఆద్యా, అనన్య, స్వపాంతి కథక్ నృత్యంతో అలరించారు.
లంచం... క్లర్కు అరెస్టు
యశవంతపుర: గ్రూప్ ఇన్సూరెన్స్ చేయడానికి లంచం తీసుకుంటూ హావేరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహకార సంఘాల ఉప రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ క్లర్కు అక్కమ్మ బిరాదార్ లోకాయుక్తకు చిక్కింది. రైతులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి ఆమె రూ.3 వేల లంచం తీసుకొంటుండగా లోకాయుక్త అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. డీఎస్పీ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మొక్కలే ఆధారం
గౌరిబిదనూరు: ప్రకృతి సమతుల్యానికి మనం విరివిగా మొక్కలు నాటి చెట్లయ్యే వరకూ పెంచి పోషించాలని వక్తలు తెలిపారు. సోమవారం తాలూకాలోని కాటనకల్లు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పండ్ల నిచ్చే మొక్కలు, నీడనిచ్చే మొక్కలను వందకు పైగా నాటారు. దూరమవుతున్న మేఘాలను ఆకరించడానికి చెట్లు అవసరమన్నారు. విద్యార్థులు నిత్యం మొక్కలకు నీళ్ళు పోసి కాపాడాలని తెలిపారు.
బ్యాంకు ఉద్యోగిని దుర్మరణం
దొడ్డబళ్లాపురం: ట్రావెలర్ టెంపో వాహనం స్కూటర్ను ఢీకొన్న ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగిని చనిపోగా, మరో అమ్మాయి తీవ్రంగా గాయపడ్డ సంఘటన దొడ్డబళ్లాపురం అపెరల్ పార్కులో జరిగింది. కంటనకుంటకు చెందిన, తూబుగెరె గ్రామంలోని యూనియన్ బ్యాంక్లో పని చేసే అశ్విని (31) అక్కడే మృతి చెందగా సహన అనే యువతి తీవ్రంగా గాయపడింది. వీరిద్దరూ సోమవారం ఉదయం స్కూటర్పై అపెరల్ పార్కులోని శాంతి స్వీట్స్ ఫ్యాక్టరీ ముందు వెళ్తుండగా టీటీ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. దొడ్డ గ్రామీణ పోలీసులు టీటీ డ్రైవరుపై కేసు నమోదు చేశారు. అతి వేగం వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.


