శ్రీనివాసపురం: ధరలు తగ్గి తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.10 మద్దతు ధర ప్రకటించాలని రైతు సంఘం పదాదికారులు డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీఎంసీ మార్కెట్లో సమావేశం నిర్వహించారు. సోమవారం శ్రీనివాసపురం మామిడి కాయల సమేతంగా రాష్ట్ర రహదారి రోజర్ పల్లి గేట్ వద్ద నుంచి రైతులు పెద్ద సంఖ్యలో కాలి నడకన బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిఘటన నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నారాయణగౌడ మాట్లాడుతూ.. మామిడి పండ్లను అత్యధికంగా పండించే శ్రీనివాసపురంలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. దిగుబడి బాగున్నా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలిపారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మామిడి ఉత్పాదనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండగా.. మామిడి రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టనున్న ప్రతిఘటనకు మామిడి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంఘం నాయకుడు బంగావాది నాగరాజగౌడ, జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్ పాల్గొన్నారు.


