కోలారు: తాలూకాలోని నరసాపురం ఫిర్కా లక్ష్మీసాగర చెరువు మరువకు అడ్డంగా నిర్మించిన బ్రిడ్జి భారీ వర్షానికి కొట్టుకుని పోయింది. ఆదివారం ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మల్సీ ఎం.ఎల్.అనిల్ కుమార్ మరువ ప్రదేశాన్ని పరిశీలించారు. పనులు నాసిరకంగా చేయడం వల్ల ఇలా జరిగిందని ఇంజినీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జి పక్కన రిటైనింగ్ వాల్ కూలి పోవడంపై మండిపడ్డారు. మరువ నీటికి మట్టి పూర్తిగా కొట్టుకు పోవడంతో కూలిందని అధికారులు చెప్పగా.. ఇంజినీర్ సమర్థనను ఎమ్మెల్యే మంజునాథ్ తోసిపుచ్చారు. ఇంత పెద్ద ప్రమాణంలో మట్టి కొట్టుకు పోతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. బ్రిడ్జి నిర్మాణం చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధ్యతా రహితంగా పనులు చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ఇకపై ఇలా జరిగితే అధికారులనే బాధ్యులను చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా త్వరగా మరమ్మత్తులు చేయాలన్నారు. కార్యక్రమంలో కోముల్ డైరెక్టర్ చంజిమలై రమేష్, డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ఖాజికల్లహళ్లి మునిరాజు పాల్గొన్నారు.


