రాయచూరు రూరల్: నగరంలో చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బోసురాజు సూచించారు. మంగళవారం నగరంలోని రాంపుర తాగునీటి చెరువు సంరక్షణపై అధికారులతో మాట్లాడారు. పట్టణాలకు తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని పైపులైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించారన్నారు. శాంతప్ప, తాయన్న నాయక్, జయన్న, శివమూర్తి, రుద్రప్ప అంగడి, అమరేగౌడ, శాలంలున్నారు.
అంబేడ్కర్ ప్రతిమ ఏర్పాటుకు వినతి
రాయచూరు రూరల్: నగరంలో అంబేడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని చలువాది మహాసభ డిమాండ్ చేసింది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లా సంచాలకుడు విశ్వనాథ్ పట్టి మాట్లాడారు. ఏడాది క్రితం కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం కాకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లాధికారిణి పూవితకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో వసంత్కుమార్, రవీంద్రనాథ్, తమ్మణ్ణ, బాబు, పుష్పరాజ్, దొడ్డమని, యల్లప్ప, విజయ్ ప్రసాద్, శరణప్ప, చెన్నరాయుడులున్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రాయచూరు రూరల్: మనిషి సంపూర్ణ ఆరోగ్య రక్షణకు యోగాపై శ్రద్ధ చూపాలని యోగా శిక్షకుడు తిమ్మప్ప పేర్కొన్నారు. బుధవారం ఆయుర్వేద ఆస్పత్రిలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఆయుర్వేద, యునాని శాఖల ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా 11 రోజుల పాటు జరిగే యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. యోగాసనాలతో ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అధికారులు శంకర్గౌడ ఐ పాటిల్, శంకర్ గౌడ, పూజాలున్నారు.
పచ్చదనం వృద్ధికి పెద్దపీట
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి పట్టణంలో పచ్చదనం వృద్ధికి పరిసరాలను సంరక్షించాలని మాజీ నగరసభ అధ్యక్షురాలు లక్ష్మిదేవి పేర్కొన్నారు. బుధవారం మాన్వి తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాజా వసంత నాయక్ జ్ఞాపకార్థం మొక్కలు నాటి మాట్లాడారు. భవిష్యత్తులో ఎండల వేడిమి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. భూగర్భ జలాల పెంపుదలకు ప్రాముఖ్యతనివ్వాలని అన్నారు.


