బళ్లారిటౌన్: బళ్లారిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయరాదని కన్నడనాడు రైతు సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం నేతలు జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. బళ్లారి జిల్లాలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయని, హెల్మెట్ ధరించడం వల్ల దీని ప్రభావం ఆరోగ్యంపై చూపుతుందన్నారు. బళ్లారి జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నందున కూలీ కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర అనారోగ్యం పాలవుతారన్నారు. రోడ్డు ప్రమాదాలకు హెల్మెట్ ఒక్కటే కారణం కాదన్నారు. నగరంలో గోతులు పడ్డ అనేక రోడ్లు, జాతీయ రహదారిలో మద్యం అమ్మకాలు, నగరంలో భారీ ట్రాఫిక్ సంచారం ఉన్నందునే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇటీవల ట్రాఫిక్ పరిశీలన వేళలో జోళదరాశి గ్రామానికి చెందిన వీరేష్ అనే వ్యక్తి పోలీసులు పట్టుకుంటారని తప్పించుకోబోయి లారీ కింద పడ్డారని, దీంతో ఆ కుటుంబం వీధి పాలైందన్నారు. ఆ కుటుంబానికి పరిహారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. కన్నడనాడు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప, పదాధికారులు ప్రహ్లాద్, శివమూర్తి, విజయ్కుమార్, యువరాజు, విరుపాక్షిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మస్తాన్, హుస్సేన్, శివకుమార్, పాల్గొన్నారు.


