బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లా సండూరు సంస్థాన రాజవంశానికి చెందిన ప్రముఖుడు, బీజేపీ నాయకుడు కార్తికేయ ఘోర్పడే (63) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 6 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుకు గురైన కార్తికేయ ఘోర్పడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్తికేయ ఘోర్పడే మాజీ మంత్రి ఎంవై ఘోర్పడే కుమారుడు. సండూరు రాజవంశ వారసుడిగా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. బీజేపీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తూ బళ్లారి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. సాధారణ జీవనశైలి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మరణంతో సండూరుతో పాటు బళ్లారి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తికేయ ఘోర్పడే పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి సండూరుకు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం సండూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మృతిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
గుండెపోటుతో బెంగళూరులో తుదిశ్వాస


