సాక్షి,బళ్లారి: వర్షాకాలం వచ్చిందంటే బళ్లారిలో పలు కాలనీలు అస్వవ్యస్తంగా మారతాయి. ప్రతి ఏటా వర్షాకాలం రావడం సర్వసాధారణం. అయితే వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు ఆయా కాలనీలు నీటికుంటల్లా మారడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వర్షాలు వచ్చినప్పుడు కాలనీ రోడ్లలో నీరు నిలిచి పోయినప్పుడు పాలకులు, అధికారులు తూతూమంత్రంగా పర్యవేక్షణ చేసి అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రకటించడం షరా మామూలే. అయితే శాశ్వత పరిష్కారం చూపక పోవడంతో కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనంతపురం రోడ్డులో బీపీఎస్సీ గర్ల్స్ హాస్టల్ సమీపంలోని కేవీటీ నగర్ 2వ క్రాస్లోని పలు రోడ్లు నీటి కుంటల్లా మారాయి.
లోతట్టు ప్రాంతాల్లో నరకయాతన
ఆయా రోడ్లు లోతట్టు ప్రాంతాలు కావడంతో బురద, వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో పాటు అలాగే నిలిచి పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే హనుమాన్ నగర్ 1వ వార్డులోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వర్షం నీరు రోడ్ల మీదనే ఉన్నాయి. వర్షం ఆగిన తర్వాత కూడా వారం, పది రోజులు బురద, వర్షం నీరు కలిసి చెరువులను, కుంటలను తలపిస్తాయి. శాశ్వత పరిష్కారం చేయాల్సిన పాలకులు, అధికారులు తాత్కాలికమైన చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రోడ్లలో వర్షం నీటి నిల్వతో
ప్రజలకు తిప్పలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు


